రూ.20 లక్షలతో షాదీమంజిల్లో మౌళిక సదుపాయాలు
నెల్లూరు 43వ డివిజన్లోని షాదీమంజిల్లో ముస్లీంసోదరసోదరీలతో సమీక్ష నిర్వహించిన మంత్రి పొంగూరు నారాయణ
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నెల్లూరు 43వ డివిజన్లోని షాదీమంజిల్లో మౌళిక సదుపాయాల నిమిత్తం తాను, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి సంయుక్తంగా రూ.20 లక్షల నిధులను మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు.
నెల్లూరు నగరంలోని 43వ డివిజన్లోని షాదీమంజిల్లో మౌళిక సదుపాయాల విషయమై ముస్లీం సోదరసోదరీమణులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. షాదీమంజిల్కు విచ్చేసిన మంత్రికి మైనార్టీ సోదరులు ఘనంగా స్వాగతం పలికారు.
పూలమాలలు వేసి బొకేలు అందజేసి శాలువాలతో ఘనంగా మంత్రిని సత్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ 2014 – 2019 టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పుడు మేయర్గా ఉన్న అబ్దుల్ అజీజ్ పర్యవేక్షణలో షాదీమంజిల్ను ఎంతో చక్కగా నిర్మించడం జరిగిందన్నారు.
పేదలు, నిరుపేదలకు ఈ షాదీమంజిల్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అయితే తాను ఎన్నికల సమయంలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడి వారు షాదీమంజిల్ విషయం చెప్పి మౌళిక వసతులు కల్పించాలని కోరారని, ఆ సమయంలో తాను, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి సంయుక్తంగా రూ.20 లక్షల నిధులు సమకూరుస్తున్నట్లు చెప్పారు.
ఆ నిధులను వక్ఫ్బోర్డ్ ఛైర్మన్ అయిన అబ్దుల్ అజీజ్కు ఇవ్వడం జరుగుతుందని, దాంతో అవసరమైన సామగ్రిని కొనుగోలు చేస్తారన్నారు.
అదేవిధంగా 53, 54 డివిజన్లలో సైతం షాదీమంజిల్కు తాను, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి కలిసి కోటి రూపాయల నిధులతో నిర్మాణానికి శ్రీకారం చుడుతామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం తమ సొంత నిధులను వెచ్చిస్తున్నట్లు తెలిపారు.
గతంలో ఎప్పుడులేనివిధంగా తెలుగుదేశం పార్టీని ఆదరించినందుకు రుణం తీర్చుకుంటున్నట్లు చెప్పారు.
నెల్లూరు స్మార్ట్ సిటీగా మార్చేందుకు అవకాశం ఉన్న మేరకు పని చేస్తున్నట్లు తెలిపారు.
కాలువల్లో సిల్ట్ తీయడం వల్లనే ఎక్కడ కూడా వరదనీరు నిల్వలేకుండా ఉండడం పట్టణ ప్రజలు అభినందిస్తున్నారని మంత్రి చెప్పారు.
అదేవిధంగా రోడ్లపైకి పశువులను వదలవద్దని సూచించారని, గతంలో అయితే పశువులను పట్టుకుని వదిలేశారని, అయితే ఇప్పుడు పట్టుకుంటే ఇక వదలడం జరగదన్నారు.
ఎట్టిపరిస్థితుల్లో పశువులను రోడ్ల మీదకు వదలవద్దని చెప్పారు. కుక్కలు ఉత్పత్తి కాకుండా వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుందన్నారు.
అలాగే నగరంలో ఫ్లెక్సీలు ఉండేందుకు వీల్లేదని, ఒక వేళ సమావేశాలు ఉంటే 48 గంటల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుని తర్వాత తీసివేయాలని ఆదేశించామని చెప్పారు.
రోడ్ల డివైడర్లలో ఉన్న లాలీపాప్ ప్లెక్సీ బోర్డులను కూడా తొలగిస్తే నగరం మరింత సుందరంగా ఉంటుందని ఆదేశించామన్నారు.
ఇలాంటి చిన్నచిన్న మార్పులు చేయడం వల్ల స్మార్ట్సిటీగా రూపాంతరం చెందుతుందని, ఇందుకు ప్రజలు సహకరించాలని మంత్రి నారాయణ ప్రజలను కోరారు.
అనంతరం వక్ఫ్బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్, రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, డిప్యూటి మేయర్ రూప్ కుమార్ యాదవ్, కమిషనర్ సూర్యతేజ, మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, టీడీపీ ముఖ్యనేతలు, తదితరులు పాల్గొన్నారు









