జూలై 31న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం…. వర్చువల్ సేవా టికెట్లకు భక్తుల నుండి విశేష స్పందన

జూలై 31న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం
వర్చువల్ సేవా టికెట్లకు భక్తుల నుండి విశేష స్పందన
సిరులతల్లి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జూలై 31న వరలక్ష్మీ వ్రతం ఏకాంతంగా జరుగనుంది.
ఈ వరలక్ష్మీ వ్రతాన్ని భక్తుల కోరిక మేరకు వర్చువల్ విధానంలో నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. భక్తులు తమ నివాస ప్రాంతాల నుండి ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించడం ద్వారా అమ్మవారి సేవలో ప్రత్యక్షంగా పాల్గొన్నామన్న భావన కలుగుతుంది. వరలక్ష్మీ వ్రతం టికెట్లు జూలై 22వ తేదీ సాయంత్రం 5.00 గంటల నుండి ఆన్ లైన్లో అందుబాటులో ఉన్నాయి. జూలై 30వ తేదీ సాయంత్రం 5.00 గంటల వరకు గృహస్తులు బుక్ చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం జూలై 31వ తేదీ ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారమవుతుంది.
ఈ సేవలో పాల్గొనే భక్తులకు తొలి శ్రావణ శుక్రవారం పూజలో అర్పించిన ఉత్తరియం, రవిక, పసుపు, కుంకుమ, కంకణాలు, గాజులు ప్రసాదంగా ఇండియా పోస్టల్ ద్వారా గృహస్తుల చిరునామాకు పంపడం జరుగుతుంది. విదేశాలలో ఉన్న భక్తులకు ప్రసాదాలు పంపడం సాధ్యం కాదని, ఈ విషయాన్ని గమనించాలని టిటిడి స్పష్టం చేసింది.
కాగా, ఈ ఆన్లైన్ సేవా టికెట్లకు భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే చాలా మంది భక్తులు బుక్ చేసుకున్నారు. ఇంకా బుక్ చేసుకోని భక్తుల కోసం బుకింగ్ విధానాన్ని ఈ కింద తెలియజేయడమైనది.
టికెట్లు బుక్ చేసుకునే విధానం
– ముందుగా www.tirupatibalaji.ap. gov.in వెబ్ సైట్ కు లాగిన్ అవ్వాలి.
– ఆన్లైన్ వరలక్ష్మీ వ్రతం (వర్చువల్ పార్టిసిపేషన్) అనే బటన్ ని క్లిక్ చేయాలి.
– ఇక్కడ టీటీడీ పొందుపరిచిన సూచనలను అంగీకరిస్తూ I Agree అనే బాక్స్ లో టిక్ గుర్తు పెట్టాలి.
– ఆ తర్వాత గృహస్తుల(ఇద్దరు) పేర్లు, వయసు, లింగం, గోత్రం, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ప్రసాదాలు పంపిణీ కోసం చిరునామా వివరాలు పొందుపరచాలి.
– ఈ సమాచారాన్ని సరిచూసుకొని కంటిన్యూ అనే బటన్ నొక్కితే పేమెంట్ పేజి వస్తుంది.
– ఏదైనా బ్యాంకు క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా సదరు టికెట్ మొత్తాన్ని చెల్లించవచ్చు.
– పేమెంట్ పూర్తయిన అనంతరం టికెట్ ఖరారవుతుంది.