సామాన్య భక్తులకే వైకుంఠ ద్వార దర్శనం
మొదటి మూడు రోజులు ఈ-డిప్ ద్వారా టోకెన్లు
చివరి ఏడు రోజులు వైకుంఠం-2 ద్వారా దర్శనం
ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలు రద్దు
పరకామణి కేసులో నిష్పక్షపాత విచారణకు బోర్డు నిర్ణయం

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు నిర్వహించనున్న పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యతనిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు వెల్లడించారు. వైకుంఠ ద్వార దర్శన విధి విధానాలపై మంగళవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవన్లో ఆయన అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కోవూరు ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కూడా పాల్గొని చర్చించారు.
దర్శన వివరాలు
డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేదీ వరకు 10 రోజులకు గాను 182 గంటల దర్శన సమయంలో దాదాపు 164 గంటల దర్శనం సామాన్య భక్తులకు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
మొదటి మూడు రోజులు: ఈ పది రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మొదటి మూడు రోజులు శ్రీవాణి దర్శనాలను, రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలు రద్దు చేస్తున్నామన్నారు. స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా సిఫార్సు లేఖలు స్వీకరించబడవని తెలిపారు. మొదటి మూడు రోజులకు అన్ని టోకెన్లు కేవలం ఆన్లైన్ ఈ-డిప్ ద్వారానే కేటాయింపు జరుగుతుందన్నారు.
రిజిస్ట్రేషన్: రిజిస్ట్రేషన్లలో పారదర్శకత పాటించేందుకు భక్తులు టీటీడీ వెబ్సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ ద్వారా ఈ-డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిజిస్ట్రేషన్ కు అవకాశం ఉందని తెలిపారు. నవంబర్ 27 నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు భక్తులు టోకెన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వెల్లడించారు.
స్థానికులకు: జనవరి 6, 7, 8 తేదీల్లో రోజుకు 5 వేల టోకెన్ల చొప్పున స్థానికులు ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ పద్ధతిలో బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
పరకామణి కేసుపై నిర్ణయం:
భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని పరకామణి కేసును నిష్పక్షపాతంగా విచారణ చేసి బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదించేందుకు బోర్డు నిర్ణయించింది. ఈ కేసులో ఎంతటి వారున్నా బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేయాలని తీర్మానం చేశారు.
ఈనెల 27వ తేదీన అమరావతిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో రెండో ప్రాకారం నిర్మాణానికి భూమిపూజలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారని తెలిపారు.


