మాదక ద్రవ్యాలు, మత్తు పదార్ధాల నివారణకు, ప్రతీఒక్కరికీ అవగాహన కల్పించడమే ఏకైక మార్గం
జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా
ఒంగోలు కలెక్టరేట్, ఏప్రిల్ 30 (సదా మీకోసం) :
జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్ధాల నివారణకు, ప్రతీఒక్కరికీ అవగాహన కల్పించడమే ఏకైక మార్గమని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు.
డ్రగ్స్ వినియోగంవల్ల కలిగే దుష్పలితాలను పెద్ద ఎత్తున వివరించడమే కాకుండా, జిల్లాలో పూర్తిస్థాయి నియంత్రణకు కట్టుధిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
బుధవారం సాయంత్రం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అధ్యక్షతన జిల్లా స్థాయి నార్కోటిక్స్ కంట్రోల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో డ్రగ్స్ను పూర్తి స్థాయిలో నివారించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్ధాల నివారణకు, ప్రతీఒక్కరికీ అవగాహన కల్పించడమే ఏకైక మార్గమని అందులో భాగంగా ప్రతీ విద్యాసంస్థలో అవగాహనా కార్యక్రమాలను విస్తృతం చేయాలన్నారు.
వచ్చే విద్యాసంవత్సరం నాటికి అన్ని ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థల్లో ఈగిల్ క్లబ్లు ఏర్పాటు చేయాలన్నారు.
ఔషద నియంత్రాణాధికారులు సంయుక్తంగా మందుల షాపులను తనిఖీ చేయాలని ఆదేశించారు.
డ్రగ్స్ వినియోగం, రవాణాపై నిఘాను పెంచి, అరికట్టేందుకు మరింత సమర్ధవంతంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఫిర్యాదులు చేసేందుకు ఏర్పాటు చేసిన 1972 టోల్ ఫ్రీ నెంబర్ కు విస్తృత ప్రచారం కల్పించాలన్నారు.
విద్యార్ధులతోపాటుగా వివిధ వర్గాల్లో విస్తృతంగా అవగాహన కల్పించడం ద్వారా జిల్లాలో డ్రగ్స్ రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టడం సాధ్యపడుతుందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోరారు.
జిల్లా ఎస్.పి ఎ.ఆర్ దామోదర్ మాట్లాడుతూ, జిల్లాలో మత్తు పదార్ధాలు, మాదక ద్రవ్యాలను అరికట్టడానికి తీసుకున్న చర్యలను వివరించారు. జిల్లాలో ఎక్కడా గంజాయి పంట సాగు జరగడం లేదని తెలిపారు.
జిల్లా మీదుగా రవాణా జరుగుతోందని, దీనిని అరికట్టేందుకు పటిష్టమైన చర్యలను తీసుకున్నామని చెప్పారు.
నమోదు చేసిన కేసుల సంఖ్యే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
జిల్లాలో ఎక్కడా గంజాయి, డ్రగ్స్ వినియోగం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు.
డ్రగ్స్ సరఫరా, వినియోగం కూడా శిక్షార్హమేనని, గంజాయి, డ్రగ్స్ వినియోగం కలిగే దుష్ప్రభావాలపై పాఠశాలలు, కళాశాలల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
జిల్లాలో ఇతర ప్రాంతాల నుండి మైనింగ్ పనుల కొరకు ఇతర ప్రాంతాల నుండి కూలీలు జిల్లా కు వస్తుంటారని, సంబంధిత పరిశ్రమల యాజమాన్యం వారిని సమన్వయము చేసుకొని కూలీల పై నిఘా ఉండేలా మైనింగ్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.
డ్రగ్స్ వినియోగం, సరఫరాకు సంబంధించి 283 మందిని గుర్తించడం జరిగిందన్నారు.
కళాశాలల్లో ఈగిల్ టీమ్లు, డ్రాప్ బాక్సులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మత్తుపదార్ధాల వినియోగాన్ని మాన్పించేందుకు జిల్లాలో డీ అడిక్షన్ సెంటర్ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
వివిధ ప్రభుత్వ శాఖల సహకారంతోనే పూర్తి స్థాయిలో డ్రగ్స్ను అరికట్టవచ్చునని ఎస్పి సూచించారు.
ప్రభుత్వ మరియు ప్రైవేట్ హాస్టళ్లనందు డ్రగ్స్ వినియోగం జరగకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలన్నారు.
స్కూల్స్, కాలేజ్, హాస్టల్స్, మరియు డాబాలలో, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజ్ లలో బోర్డ్ లు.. మత్తు పదార్థాల నివారించే చర్యలపై పోస్టర్లను ఏర్పాటు చేయాలన్నారు.
అనంతరం డ్రగ్స్ నియంత్రణ పై రూపొందించిన బ్రోచర్ల ను ఆవిష్కరించారు.
సమావేశంలో అడిషనల్ ఎస్పీ నాగేశ్వర రావు, మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్ డిఆర్ఓ చిన ఓబులేసు ఆర్ డి ఓ లక్ష్మీ ప్రసన్న, జీజీహెచ్ సూపరింటెండెంట్ డా జమున, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డా ఏడుకొండలు, డిడి సోషల్ వెల్ఫేర్ లక్ష్మా నాయక్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.