కూలిన చెట్లు.. స్తంభించిన రాకపోకలు
గాలివాన దుమారంతో నగరవ్యాప్తంగా ట్రాఫిక్ సమస్య
హైదరాబాద్, ఏప్రిల్ 19 (సదా మీకోసం)
వర్షం దెబ్బకి నగరం వణికిపోయింది. శుక్రవారం సాయంత్రం కుండపోత వాన, బలమైన గాలులు నగరంపై విరుచుకుపడ్డాయి.
చెట్లు నేలకొరిగాయి. విద్యుత్తు స్తంభాలు దెబ్బతిన్నాయి.
ఓ ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది.
పాతబస్తీలో అధిక వర్షపాతం నమోదవగా, ప్రధాన నగరంలోనూ ఓ మోస్తారు వాన కురిసింది.
విద్యుత్తు సరఫరాలో అంతరాయంతో కాలనీల్లో చీకట్లు అలముకున్నాయి.
రాత్రి 11గంటల వరకు అధికారుల సహాయక చర్యలు కొనసాగాయి.
బషీర్బాగ్లో పెట్రోలుబంకు ఎదురుగా, కోఠి బ్యాంక్ స్ట్రీట్, సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రి ఎదురుగా, రెడ్హిల్స్, మాదాపూర్, సాలార్జంగ్ మ్యూజియం రోటరీ, చాంద్రాయణగుట్ట ఎక్స్ రోడ్డు, కాచిగూడ డీ మార్ట్, రంగ్ మహల్ నుంచి సీబీఎస్ వెళ్లే రహదారి, తెలుగు తల్లి పైవంతెనపై, చిరాగ్అలీ రోడ్డు, గన్పార్క్, అసెంబ్లీ ముందు, తదితర ప్రాంతాల్లో చెట్లు కూలాయి. రాకపోకలు స్తంభించాయి.
సైదాబాద్ కాలనీలో జయనగర్ ఫీడర్ పరిధిలోని 11కె.వి లైనుపై ఓ చెట్టు విరిగి పడింది. ఎల్టీ స్తంభం ధ్వంసమైంది.
తెల్లాపూర్ ఉస్మాన్నగర్లో ఫ్లెక్సీ విద్యుత్తు తీగలపై పడింది. బాటసింగారం, సరూర్నగర్, అబ్దుల్లాపూర్మెట్, బడంగ్పేట్ ప్రాంతాల్లోనూ హోర్డింగులపై ఉండే ఫ్లెక్సీలు విద్యుత్తు తీగలను చుట్టేశాయి.
బేగంపేట్ మోతిలాల్నగర్ ఫీడర్, మేడ్చల్ పరిధిలోని సయ్యుక్ మేఫెర్ ఫీడర్ల విద్యుత్తు తీగలు దెబ్బతిన్నాయి.
లంగర్హౌజ్ బాపునగర్, తదితర ప్రాంతాల్లోనూ స్తంభాలు దెబ్బతిన్నాయి.
మొత్తంగా 11కేవీకి చెందిన 359 ఫీడర్లు దెబ్బతిన్నట్టు అధికారులు వెల్లడించారు.
350 ఫీడర్లను పునరుద్ధరించారు. మిగతా వాటి వద్ద మరమ్మతులు కొనసాగుతున్నాయి.
పనులను టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ పర్యవేక్షించారు.2-4 గంటలపాటు విద్యుత్తు అంతరాయం ఏర్పడింది.
నిర్మాణంలోని ఆకాశహర్మ్యాల వద్ద సుడిగాలులు బీభత్సం సృష్టించాయి.
కార్మికుల రేకుల షెడ్లు, సామగ్రి గాల్లో ఎగిరాయి. పలువురు కూలీలు గాయాలపాలయ్యారు.
\
నగరంలో శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.
అబిడ్స్ రామకృష్ణ థియేటర్ ఎదురుగా ఉన్న మురళీధర్బాగ్లో ప్రమాదం సంభవించింది.
నిర్మాణంలో ఉన్న భవనం వద్ద భారీ క్రేన్ కుప్పకూలింది. ప్రమాదంలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.
ఘటనా సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.