మే 1 లోగా నెల్లూరు, సంగం బ్యారేజీ ప్రారబిస్తున్నాం : మంత్రి అనిల్

మే 1 లోగా నెల్లూరు, సంగం బ్యారేజీ ప్రారబిస్తున్నాం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక
ప్రకటించిన ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
నెల్లూరు ప్రతినిధి, మార్చి 19న (సదా మీకోసం) :
నెల్లూరు జిల్లాలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు అయిన సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజ్ లను మే 1వ తేదీ లోగా ప్రారంభించబోతున్నామని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.
నెల్లూరు నగరంలోని పెన్నా బ్యారేజ్ వద్ద జరుగుతున్న నిర్మాణ పనులను శనివారం మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరిశీలించారు.
పరిస్థితులు అన్నీ అనుకూలిస్తే ఏప్రిల్ చివరి వారంలోనే ప్రారంభించే అవకాశం కూడా ఉందని ఆయన వివరించారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఇప్పటికే సంగం బ్యారేజీకి సంబంధించి దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి పేరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామకరణ చేశారన్నారు.
రెండు బ్యారేజ్ ల పనులు దాదాపు పూర్తయ్యాయన్నారు. పెన్నా బ్యారేజ్ తో రంగనాయకులపేట సంతపేట తదితర ప్రాంతాల్లో భూగర్భ నీటి మట్టం పెరుగుతుందన్నారు.
బ్యారేజ్ కి సంబంధించి ఫినిషింగ్ వర్క్ పనులకు గ్రావెల్ కొరత ఎక్కువగా ఉందని, అప్రోచ్ రోడ్ల పనులు మరో నెలలోగా పూర్తి కానున్నాయన్నారు.
వారధి సెంటర్ వద్ద నివాస గృహాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కాంక్రీటు నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేస్తామన్నారు.
మంచి ముహూర్తం చూసుకొని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ఈ రెండు బ్యారేజీలు ప్రారంభమైతే నెల్లూరు జిల్లా రైతాంగం కన్న కలలు సాకారమవుతాయన్నారు.
కార్యక్రమంలో తెలుగు ఇంజనీర్ హరినారాయణ రెడ్డితోపాటు ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.