నెల్లూరులో లాక్డౌన్ అమలు.. నిబంధనలు ఇవే..

ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని పలు నగరాలు స్వచ్ఛందంగా లాక్డౌన్ విధించుకుంటున్నాయి. తాజాగా నేటి నుంచి నెల్లూరులో లాక్డౌన్ తరహా ఆంక్షలు అమలులోకి వచ్చాయి. జూలై 31 వరకు ఈ నిబంధనలు అమలవుతాయని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు వెల్లడించారు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిత్యావసరాల దుకాణాలకు మాత్రమే అనుమతి ఉండగా.. ఆ తర్వాత అందరూ కూడా స్వచ్ఛందంగా షాపులు మూసివేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అటు మెడికల్ షాపులు, అత్యవసర సేవలకు ఎలాంటి ఆంక్షలు ఉండవని స్పష్టం చేశారు.
కాగా, నగరంలో రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ లాక్ డౌన్ విధిస్తున్నామని.. దీనికి ప్రజలు, వ్యాపారాలు సహకరించాలని ఆయన తెలిపారు. అవసరమైతే తప్ప ప్రజలు ఎవ్వరూ కూడా ఇళ్ల నుంచి బయటికి రాకూడదని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సూచించారు. ఇక నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు 3,117 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇందులో 1600 కేసులు నెల్లూరులోనే ఉన్నాయి. దానితో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు జిల్లా కలెక్టర్ ఇవాళ్టి నుంచి నెల్లూరులో లాక్డౌన్ తరహా ఆంక్షలు అమలులోకి తీసుకొచ్చారు.