ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యత
ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయడం ప్రభుత్వ బాధ్యతా రాహిత్యం
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ పూర్వ కార్యదర్శి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ పి.వి.రమేష్
విజయవాడ, ఏప్రిల్ 20 (సదా మీకోసం) :
ఆరోగ్యం అనేది పౌరుని ప్రాథమిక హక్కుగా మారాలని, ప్రజలకు ఆరోగ్యాన్ని అందించడం ప్రభుత్వ బాధ్యతగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పూర్వ కార్యదర్శి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ పి.వి.రమేష్ అన్నారు. ఆదివారం ఉదయం విజయవాడ మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రజారోగ్య వేదిక, జన విజ్ఞాన వేదిక,మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో ‘ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య రంగం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ మరియు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య బడ్జెట్ విశ్లేషణ అనే అంశాలపై సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు డా. ఎం.వి.రమణయ్య అధ్యక్షత వహించారు. సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ పి.వి రమేష్, ప్రముఖ బడ్జెట్ విశ్లేషకులు డాక్టర్ డేవిడ్ సుధాకర్ పాల్గొన్నారు
ఈ సందర్భంగా వీరు తమ ప్రసంగంలో పలు అంశాలను ప్రస్తావించారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాలు మారుతున్నా ఆరోగ్య రంగంలో మార్పులు రావడంలేదని, సంవత్సరాలు గడిచే కొద్దీ ప్రభుత్వాలు తమ బాధ్యత నుంచి తప్పుకుంటూ, ప్రైవేటు రంగానికి వైద్యాన్ని అప్పజెప్పడం ఆందోళనకరమైన అంశంగా రమేష్ పేర్కొన్నారు. వైద్యాన్ని వ్యాపారంగా చూస్తున్న కారణంగా అందులో ఆదాయం తప్ప ప్రజల బాగోగులు పూర్తిగా మరుగయ్యాయని అన్నారు. ఆరోగ్య రంగంలో కేరళ రాష్ట్రం భారతదేశానికి ఆదర్శవంతంగా ఉందని, ఇతర రాష్ట్రాలతో పోలిక చేసుకున్నప్పుడు మరణాల రేటు కేరళలో తక్కువగా ఉందని వైద్య సౌకర్యాలు బాగా మెరుగయ్యాయని ప్రజలకు తేలికైన, చౌకైన, ఉచిత వైద్యం అందుబాటులో ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రపంచానికి జర్మనీలోని ఆరోగ్య రంగం ఆదర్శంగా ఉంటే భారతదేశంలోని చిన్న రాష్ట్రం కేరళ భారతదేశానికి ఆదర్శంగా ఉందని గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఆరోగ్య రంగంలో తన పాత్రను విస్మరిస్తున్నదని, చిత్తూరులోని ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో వారికి బదలాయించటం, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 10 మెడికల్ కాలేజీలు నిర్వహిస్తామని ప్రకటించటం, క్యాపిటేషన్ ఫీజు పేరిట కోట్ల రూపాయలు అర్హతతో నిమిత్తం లేకుండా విద్యార్థుల నుంచి వసూలు చేసుకొని సీట్లు కేటాయించాలని భావించటం సమర్థనీయం కాదని ఈయన విమర్శించారు. రైతాంగంలో కేవలం ఆరోగ్య ఖర్చులు భరించలేక ప్రతి నలుగురులో ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారన్న ఆందోళనకరమైన విషయం వెలుగులోకి వచ్చిందని ఆమె తెలిపారు. అభివృద్ధి అంటే రోడ్లు వేయటం, పెద్ద పెద్ద కార్లు కొనడం, జిడిపి లెక్కలు చూపటం కాదని ఆరోగ్యంతో జీవించడమేనని ఈయన వ్యాఖ్యానించారు.
70 శాతం వ్యాధులకు ఎలాంటి పరీక్షలు అవసరం లేకుండానే సాధారణ మందులతో నయం చేయవచ్చని గణాంకాలు చెబుతుండగా కార్పొరేట్ వైద్యం ప్రతిదానికి ఎంఆర్ఐ, సిటీ స్కాన్, వైద్య పరీక్షల పేరుతో కోట్ల రూపాయలు ప్రజల నుంచి కొల్లగొట్టడం సర్వసాధారణంగా మారిపోయిందని ఈయన దుయ్యబట్టారు.
ప్రజలందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం ద్వారా ఆరోగ్యాలను కాపాడుతామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటలు ఏ రకంగానూ ఉపయోగపడవని, ఇన్సూరెన్స్ రంగానికి ప్రజలను వదిలిపెట్టడం అంటే ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకున్నట్లేనని రమేశ్ అన్నారు.
పి పి పద్ధతిలో ప్రైవేటీకరణ జరిగితే కాలేజీ యాజమాన్యం సగం సీట్లు కాలేజీ వాళ్ళు అమ్ముకోవచ్చని,. ఫీజులు పెరిగిపోతాయని,సాధారణంగా ఉన్న రు15,000 ఫీజును 12 లక్షలు, 20 లక్షలకు అమ్ముకుంటారని, ఇప్పుడు ఉన్న రిజర్వేషన్లు సగానికి తగ్గిపోతాయని, పేద విద్యార్థుల డాక్టర్ల అయ్యే అవకాశం తగ్గిపోతుందని, వైద్య రంగంలో సేవా దృక్పథం తగ్గిపోయి వ్యాపార దృక్పథం పెరుగుతుందని, పేదవారికి వైద్యం అందదని ప్రజారోగ్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామేశ్వరావు తెలిపారు. నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో 107,108 జీవోల ద్వారా మెడికల్ సీట్లను అమ్మే సెల్ఫ్ ఫైనాన్సింగ్ పద్ధతిని ప్రభుత్వం తీసుకురావడం చాలా దారుణమని, పేదవారికి చాలా అన్యాయం జరుగుతుందని, మా ప్రభుత్వం రాగానే 107, 108 జీవో లను రద్దు చేస్తామని చెప్పిన ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ జీవోలను రద్దు చేయకపోవడమే కాకుండా ఆ కాలేజీలను సైతం ప్రైవేట్ పరం చేయడం మరింత దారుణమని ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎం.వి రమణయ్య తెలిపారు.
ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపులు స్థూల జాతీయ ఉత్పత్తిలో కనీసం 6% ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పుడో తెలిపిందని, ప్రపంచ బ్యాంకు సమాచారం ప్రకారం 2021 వ సంవత్సరంలో తమ జాతీయ గరిష్ట ఉత్పత్తి లో క్యూబా 12.64%, యునైటెడ్ కింగ్డమ్ 19.35%, జర్మనీ 10.27%, అమెరికా 9.6%, ఆస్ట్రేలియా 9.47%, జపాన్ 9.17% ఆరోగ్య రంగం పైన ఖర్చు చేస్తున్నాయని, కానీ మన ప్రభుత్వం 1.9 శాతానికి మించి కేటాయింపులు చేయట్లేదని,2025 సంవత్సరానికల్లా స్థూల జాతీయ ఉత్పత్తిలో 2.5%నికి ఆరోగ్య బడ్జెట్ను పెంచుతామని 2017 లో తయారుచేసిన జాతీయ ఆరోగ్య వైద్య విధానం ప్రకటించి 2025 వచ్చినా కేవలం 1.9% లోపుకే పరిమితమవడం చాలా బాధ్యత రాహిత్యమని బడ్జెట్ విశ్లేషకులు డాక్టర్ డేవిడ్ రాష్ట్రం ప్రభుత్వం లేదని ఆరోగ్య రంగానికి సరిపడా బడ్జెట్ లేకుండా ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుందని నొక్కి చెప్పారు కంటే ప్రశ్నించారు సుధాకర్ తెలియజేశారు.
మన రాష్ట్ర ప్రభుత్వం గత ఎనిమిది సంవత్సరాల లో ఆరోగ్య రంగానికి కేటాయించినది రాష్ట్ర గరిష్ట ఉత్పతి లో 1.3 శాతానికి మించడం లేదని,. ఆరోగ్య రంగానికి సరిపడా బడ్జెట్ కేటాయింపులు లేకుండా ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుందని ప్రశ్నించారు
మన రాష్ట్రంలో ఆరోగ్యశాఖ సిబ్బందిలో చాలా ఖాళీలు ఉన్నాయని మల్టీపర్పస్ అసిస్టెంట్ పోస్టులు(మహిళలు) 20,064 అవసరం ఉంటే 1,852 పోస్టులు ఖాళీలు ఉన్నాయని, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (పురుషులు) 10,032 స్థానాలు ఉంటే 6,639 ఖాళీలు ఉన్నాయని, జనరల్ మెడిసిన్ విభాగంలో 380 పోస్టులు గాను 115 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇలా అనేక విభాగాల్లో ఖాళీలు విపరీతంగా ఉన్నాయని ఇలా ఖాళీలు పెట్టుకుని ఏ విధంగా ప్రజలకి ఆరోగ్యాన్ని అందించగలరని ప్రశ్నించారు. రాష్ట్రంలోని 5 జిల్లా ఆసుపత్రులలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లు అందుబాటులో లేవని దీని కారణంగా రోగులు పొందవలసిన క్రిటికల్ మరియు లైఫ్ సపోర్ట్ అందడం లేదన్నారు.
ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ ప్రకారం జనాభా ఆధారంగా ఉండవలసిన ప్రైమరీ హెల్త్ సెంటర్లలో 15.47 శాతం సిబ్బంది కొరత ఉందని. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 57. 52 శాతం సిబ్బంది కొరత ఉందని. గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో 680 ప్రొఫెసర్ కేడర్ పోస్టుల్లో 149 పోస్టులు మరియు 744 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల్లో 150 పోస్టులు ఖాళీగా ఉన్నాయని. వైద్య రంగంలో ఉన్న ఇన్ని లోపాలతో ప్రజలకు సరిపోయిన వైద్యం జరిగేది ఎలా సాధ్యమవుతుందని దేవిడ్ సుధాకర్ పెద్ద ప్రశ్న లేవనెత్తారు. తగిన ఆరోగ్య బడ్జెట్ సు కేటాయించి ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించాలని డేవిడ్ సుధాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వైద్యరంగంలో సేవా దృక్పథం తగ్గిపోతోందని వ్యాపార దృక్పధం పెరుగుతుందని, ప్రభుత్వాలు కూడా బాధ్యతలు తప్పించుకుని ప్రవేటు వైద్య రగాన్ని అభివృద్ధి చేయాలని చూస్తున్నారని , ఇది భవిష్యత్తులో పేదవారికి చాలా ఇబ్బందిగా మారబోతుందని దీనిని అధిగమించాలంటే ప్రజా పోరాటేలే పరిష్కారమని
ప్రఖ్యాత వైద్యులు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ జి. సమరం అన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో వైద్యం ప్రజలకు అందడం లేదని, సరిపడ వైద్య పరికరాలు వైద్య సిబ్బంది లేరని ప్రభుత్వ వైద్య కళాశాలలను మరియు ప్రభుత్వ హాస్పటల్ అభివృద్ధి చేయడం చాలా అవసరమని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వి. రాంప్రసాద్ అన్నారు. వైద్య రంగంలో కార్పొరేట్ వైద్యం పెరిగిపోతుందని, దీనివల్ల పేదవాడు వైద్యం పొందలేని పరిస్థితి వస్తుందని,ప్రభుత్వ వైద్యశాలలను ప్రైవేటు వారికి అప్పజెప్పడం దారుణమని, సెల్ ఫైనాన్స్ విధానం వలన నిమ్నవర్గాల వారికి రిజర్వేషన్ 50 శాతం తగ్గిపోతుందని, దీనిని వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉందని హైకోర్టు అడ్వకేట్ ఠాగూర్ యాదవ్ తెలిపారు.ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఏ. పూర్ణానంద్, ప్రముఖ వ్యాస్కులార్ సర్జన్ మాకినేని కిరణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రజారోగ్య వేదిక ఆర్గనైజింగ్ కన్వీనర్ జి.విజయ ప్రకాష్, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుర్రా రామారావు, ఎం.బి విజ్ఞాన కేంద్రం కార్యదర్శి టి. క్రాంతి కిరణ్, ప్రజారోగ్య వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ పి. సాయి ప్రసాద్, వైద్య విద్యార్థులు, వైద్య ఆరోగ్య రంగ కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు
ఆరోగ్య భద్రతకై చట్టం చేయాలి
ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి,
సదస్సులో తీర్మానం
ఆరు కోట్ల మంది ఆంధ్రులు ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య భద్రత చట్టాన్ని అమల్లోకి తేవాలని, ఆరోగ్యం ప్రాథమిక హక్కుగా మార్చాలని, పి పి.పి పేరుతో ప్రైవేటీకరణ చేసి ఆరోగ్య రంగాన్ని ధ్వంసం చేయబోతున్న తీరు మార్చుకోవాలని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వైద్య కళాశాలలు నడపాలని ప్రజారోగ్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామేశ్వరరావు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది.