ప్రజల జీవన స్థితిగతులను మెరుగు పరుస్తాం : మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి

ప్రజల జీవన స్థితిగతులను మెరుగు పరుస్తాం
మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి
కోవూరు, నవంబర్ 23 (సదా మీకోసం) :
భారీ వరదల కారణంగా నీటమునిగిన గ్రామాలకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించి ప్రజల జీవన స్థితిగతులను మెరుగు పరుస్తామని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.
మంగళవారం ఉదయం కోవూరు సమీపంలోని రుక్మిణి కళ్యాణ మండపంలో వరద బాధితులకు ఉచితంగా బియ్యం, నిత్యావసర సరుకులను కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, కలెక్టర్ చక్రధర్ బాబుతో కలిసి ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ప్రభావిత ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు చేపడుతున్న సహాయక చర్యలను ముఖ్యమంత్రి స్వయంగా తెలుసుకుంటున్నారని, బాధితులందరికీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
సోమశిల జలాశయం తెగిపోయిందని కొంతమంది కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వీటిని ఎవరూ నమ్మవద్దని, సోమశిల జలాశయం సురక్షితంగా ఉందని స్పష్టం చేశారు. మంత్రి వెంట జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్, ఆప్కాబ్ చైర్మన్ అనిల్ బాబు, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్ రెడ్డి తదితరులు ఉన్నారు.