కరోనా పరీక్షలకు సంజీవని – పరిశీలించిన కాకాణి
లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో పొదలకూరు మండలంలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.
నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండల కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంజీవిని మొబైల్ వాహనం ద్వారా జరుగుతున్న కరోనా పరీక్షలను పరిశీలించారు.
అనంతరం సంజీవిని వాహన డ్రైవర్లను, సహాయకులను శాలువాలతో సత్కరించి, ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి సంజీవిని మొబైల్ వాహనాలను ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు కరోనా పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని,కరోనా పరీక్షలు చేయించుకోవాలనుకునే వారి కోసం సంజీవిని బస్సును ఏర్పాటు చేయడంతో పాటు, ఇతర ప్రదేశాలలో కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు.కరోనా పాజిటివ్ వచ్చిన వారికి ఇబ్బందులు కలగకుండా వైద్యం, అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గ ప్రాంతంలోని ప్రజలెవ్వరూ ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని,కరోనా వచ్చిన వారికి ఇంట్లోనే ఉండి వైద్యం చేయించుకునేలా డాక్టర్లు సూచనలు సలహాలు అందిస్తున్నారన్నారు. ఇంట్లో ఉండి ఇబ్బందులు పడే వారిని మాత్రం కోవిడ్ సెంటర్లకు పంపి వైద్యం అందిస్తున్నామన్నారు.
నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు 200 పడకలతో కోవిడ్ సెంటర్ తో పాటు, ప్రతి మండలంలో క్వారంటైన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పగలనక, రాత్రనక విధులు నిర్వహిస్తున్న సంజీవిని బస్సు డ్రైవర్లకు, సహాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నానన్నారు.