‘మోత మోగిద్దాం!’

రేపు ‘మోత మోగిద్దాం!’
వినూత్న నిరసనకు తెదేపా పిలుపు
రాత్రి 7 నుంచి 7.05 గంటల మధ్య
ప్రజలు తాము ఉన్నచోటే మోత మోగించి ప్రజాశబ్దం
అమరావతి, సెప్టెంబర్ 29 (సదా మీకోసం) :
తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెదేపా సెప్టెంబర్ 30న వినూత్న నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది.
చంద్రబాబుకు మద్దతుగా శనివారం రాత్రి 7గంటల నుంచి రాత్రి 7.05 గంటల వరకు ఐదు నిమిషాల పాటు ప్రజలంతా సీఎం జగన్కు వినిపించేలా ఏదో ఒక రకంగా మోత మోగించాలని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, నారా బ్రాహ్మణి విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు వారు ‘ఎక్స్’ (ట్విటర్)లో వేర్వేరుగా పోస్టులు పెట్టారు.
నియంత ముందు మొరపెట్టుకుంటే ఫలితం ఉండదని.. అధికార మత్తు వదిలేలా మోత మోగించాల్సిందేనంటూ ప్రత్యేక పోస్టర్ను పోస్ట్ చేశారు.
ఐదు కోట్ల ఆంధ్రులంతా ఒక్కటిగా ఇంట్లోనో, ఆఫీస్లోనో ఇంకెక్కడ ఉన్నా సరే బయటకు వచ్చి గంట లేదా ప్లేట్ మీద గరిటెతో కొట్టాలని, రోడ్డుపై వాహనంతో ఉంటే పక్కకు ఆపి హారన్ మోగించాలని కోరారు.
ఎవరు ఏ రూపంలో నిరసన తెలిపినా సంబంధిత వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
‘‘అక్రమ అరెస్టు చేస్తే ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చూపిద్దాం. తప్పుడు కేసులు బనాయిస్తే వెనక్కి తగ్గమని నిరూపిద్దాం.
నిలువెత్తు నిజాయితీ రూపం, తెలుగు తేజం చంద్రబాబుకు మద్దతుగా తెలుగు వారంతా ఉన్నారని నిరూపించే తరుణమిది.
నిష్కళంక రాజకీయ మేరునగధీరుడు చంద్రబాబు నాయుడుకు మద్దతుగా 30వ తేదీ శనివారం రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాలకు ఉన్న చోటే మోత మోగించి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాశబ్దం వినిపిద్దాం’’ అని లోకేశ్ పిలుపునిచ్చారు.
మీ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేయండి: భువనేశ్వరి
మరోవైపు ఇదే అంశంపై చంద్రబాబు సతీమణి భువనేశ్వరి సైతం ట్వీట్ చేశారు.
‘‘చంద్రబాబు గారి మీద తప్పుడు కేసు పెట్టి, ఆయన అవినీతి చేశారని చెప్తే ప్రజలు నమ్మేస్తారని అనుకుంటున్నారు.
మీ నిశ్శబ్దం వారి నమ్మకాన్ని నిజం చేస్తుంది. అందుకే ఆ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేయండి. శబ్దం చేయండి.
చంద్రబాబు పట్ల మీరు చేసింది తప్పు అని వాళ్ళకి చెప్పండి. చంద్రబాబుకు మద్దతుగా శనివారం రాత్రి 7 నుండి 7.05 గంటల వరకు 5 నిమిషాల పాటు వీధుల్లోకి వచ్చి గంటలు మోగించండి.
లేదా ఒక పళ్లెం తీసుకుని గరిటెతో కొట్టండి. విజిల్ వేయండి. రోడ్డు ప్రయాణంలో ఉన్నా పరవాలేదు. వాహనం పక్కకు తీసుకుని హారన్ కొట్టండి. మొత్తమ్మీద ఏదో ఒక శబ్దం చేయండి.’’ అని విజ్ఞప్తి చేశారు.
ప్రజలు మౌనంగా ఉంటే అన్యాయం చెలరేగిపోతుంది: బ్రాహ్మణి
‘‘పాలకుల అక్రమాలకు అడ్డు చెప్పకపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ముఖ్యంగా ప్రజలు మౌనంగా ఉంటే అన్యాయం చెలరేగిపోతుంది.
అందుకే ఏపీ ప్రజలకు నా విజ్ఞప్తి! చంద్రబాబు గారి గురించి మీకు బాగా తెలుసు. ఆయన్ను అక్రమంగా నిర్బంధించడం తప్పు అని చెప్పండి.
చంద్రబాబుకు మద్దతుగా సెప్టెంబర్ 30, రాత్రి 7 నుండి 7.05 గంటల వరకు 5 నిమిషాల పాటు వీధుల్లోకి వచ్చి గంటలు మోగించండి.
లేదా ఒక పళ్లెం తీసుకుని గరిటెతో కొట్టండి. విజిల్ వేయండి.
రోడ్డు ప్రయాణంలో ఉంటే హారన్ కొట్టండి. మొత్తమ్మీద ఏదో ఒక శబ్దం చేసి ప్రభుత్వానికి మీ నిరసన తెలియజేయండి’’ అని తెలుగు ప్రజలకు బ్రాహ్మణి విజ్ఞప్తి చేశారు.