సింహపురి గడ్డ అదిరింది…. రైతులు త‌మ స‌త్తా చాటారు…!

Spread the love

సింహపురి గడ్డ అదిరింది

రైతులు త‌మ స‌త్తా చాటారు

  • అన్నం పెట్టే అన్నదాత గిట్టుబాటు ధర కోసం అల్లాడుతుంటే ప్రజాప్రతినిధులున్నది ఫిడేలు వాయించుకునేందుకా
  • కనీస మద్దతు ధర పొందడం రైతు హక్కు..ఆ హక్కును జగన్ రెడ్డి ప్రభుత్వం కాలరాస్తోంది
  • ధాన్యం కొనుగోలు చేయలేమని చెప్పిన చోట రైతు భరోసా కేంద్రాలకు తాళం వేయండి
  • రైతన్న రోడ్డెక్కితే ఎంతటి మొండి ప్రభుత్వమైనా దిగిరావల్సిందే.. కేంద్రంలో వ్యవసాయ బిల్లులు, రాష్ట్రంలో మూడు రాజధానుల బిల్లుల ఉపసంహరణే అందుకు నిదర్శనం
  • జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడం తెలియదు..వారికి తెలిసిందొకటే..తమ అవినీతి, అక్రమాలను ప్రశ్నించిన వారిని బూతులు తిట్టడం, తిట్టించడమే
  • నెల్లూరు జిల్లాలో మూడేళ్లుగా ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న దోపిడీపై కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీ వేసి విచారణ జరిపించాలి
  • ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ నెల్లూరులో జరిగిన రైతు ప్రదర్శనలో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
  • నెల్లూరులోని నర్తకీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు కదంతొక్కిన వేలాది మంది రైతులు
  • మండుటెండలో తెల్లటి పంచెలతో సింహపురిని శ్వేతమయం చేసి నిరసనలోనూ తమ ప్రత్యేకతను చాటుకున్న అన్నదాతలు

నెల్లూరు ప్ర‌తినిధి, మార్చి 23 (స‌దా మీకోసం) :

 

ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో నెల్లూరులో జరిగిన రైతు ప్రదర్శనలో ఆయ‌న మాట్లాడుతూ, సింహపురి గడ్డ అదిరింది.. రైతన్న పంచె ఎగ్గడితే ఎలా ఉంటుందో చూపించారన్నారు.

కష్టపడి పండించిన ధాన్యానికి మద్దతు ధర లభించకకుండా జిల్లాలో 10 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఒక మంత్రి, 46 మంది జెడ్పీటీసీలు, 46 మంది ఎంపీపీలు ఏం చేసుకోను…. దళారులు దోచుకుంటూ అన్నదాత నడ్డి విరుగుతున్న పరిస్థితుల్లో అధికారులు నిస్సహాయంగా మారిపోతే ప్రజాప్రతినిధులు ఉన్నది ఫిడేలు వాయించుకునేందుకా అని ప్ర‌శ్నించారు.

రైతుల కష్టాలు తెలుసుకునేందుకు జిల్లా వ్యాప్తంగా పర్యటించాం..రైతులు పడుతున్న బాధలు స్వయంగా తెలుసుకున్నామ‌ని తెలిపారు.

వారి గోడు వింటుంటే కడుపు తరక్కుపోయింది..కంట కన్నీరు వచ్చే పరిస్థితి..మూడు రూపాయలు, నాలుగు రూపాయల వడ్డీలకు తెచ్చి పంట పండిస్తే పుట్టి రూ.12 వేలకు అడుగున్నారని ఆవేదన వ్యక్తం చేశారు

 

కౌలు రైతులైతే కౌలు పోను ఎకరాకు రూ.15 వేలు నష్టం అంటుంటే జీర్ణించుకోలేని పరిస్థితని, సంగం మండలం పెరమన రైతు కిరణ్ కుమార్ రెడ్డి అయితే దిక్కుతోచని స్థితిలో ఏకంగా తహసీల్దార్ కార్యాలయం వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడ‌న్నారు.

ఓ వైపు సేద్యంలో వరుస నష్టాలు, మరోవైపు ఈ సీజన్ లో పండించిన పంటను కొనే దిక్కులేక ఆత్మహత్యాయత్నం చేస్తే వైసీపీ నేతలు రంగ ప్రవేశం ఇతర కారణాల వల్ల పురుగు మందు తాగాడని చెప్పాలని కుటుంబసభ్యులపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. పుట్టి రూ.16660కి కొనుగోలు చేస్తామని జగన్ రెడ్డి ఫొటోలతో రైతు భరోసా కేంద్రాల్లో అట్టహాసంగా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని, గింజ గింజా ధాన్యం కొంటామని రాతలు రాసుకున్నారని, ఐదు కోట్ల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి ఇలా పచ్చి అబద్దాలు చెప్పుకోవడం బాధాకరం అన్నారు.

ధాన్యం కొనుగోలు చేయని చోట ఆర్బీకేలకు తాళం వేయండి..ఎవరు వస్తారో చూద్దాం అన్నారు.

ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మూడు మొదటి పంటలు, రెండు రెండో పంటల విషయంలో ఒక్క నెల్లూరు జిల్లా రైతులు రూ.3 వేల కోట్లు నష్టపోయారని, ఈ మూడేళ్లలో నెల్లూరు జిల్లాలో రైతుల విషయంలో జరిగిన దోపిడీపై కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

 

రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ పంటలో నెల్లూరు జిల్లా కాకుండా 80 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది..నెల్లూరుతో కలిస్తే కోటి టన్నుల దిగుబడి వస్తోందని, ఈ రోజుకి రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం 39 లక్షల టన్నులు మాత్రమే…ఆ ధాన్యంలో కూడా ఎక్కువ శాతం దళారులు, వైసీపీ నేతల వద్ద కొనుగోలు చేసినవేన‌ని, పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో ఒక్క పంటలోనే కోటి టన్నుల ధాన్యం సేకరించిన ఘనత ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ ది.. అక్కడి రైతులకు 3 రోజులలో నగదు చెల్లించేస్తున్నారని తెలిపారు.

ఆ కోటి టన్నుల ధాన్యాన్ని కూడా కేంద్రమే తీసుకోవాలని ప్రధాని మోదీతో కేసీఆర్ పోరాడుతున్నారు..

కానీ కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోదీని ప్రశ్నించే ధైర్యం ఏపీ సీఎం జగన్ రెడ్డికి లేకుండా పోయిందని, రైతులు రోడ్డెక్కితే రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వమైనా దిగిరావల్సిందే..వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడమే అందుకు నిదర్శనం అన్నారు. వైసీపీ ప్రభుత్వం రాజధానిని మూడు ముక్కలు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై అమరావతి రైతులు కదం తొక్కితే దిగొచ్చి మూడు రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకోవాల్సివచ్చిందని, 2016లో పుట్టి ధాన్యాన్ని రూ.14,400కి, 2017లో రూ.15,700కి అమ్ముకున్న రైతులు ఈ రోజు రూ.12 వేలకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్ప‌డింద‌న్నారు.

జిల్లాలో దాదాపు 25 లక్ష్యల పుట్లు దిగుబడి ఉంటుందని అంచనా.. రైతుల వద్ద ధాన్యం మద్దతు ధరకు ప్రభుత్వం కొనకుంటే ఈ ఒక్క పంటలో 1000 కోట్లు నష్టపోయే పరిస్థితిని, టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016లో దిగుబడులు ఎక్కువైన సందర్భంలో రైతులు దేశంలో ఎక్కడైనా అమ్ముకునే అవకాశం కల్పించాం..అక్కడక్కడా అధికారులు ఇబ్బంది పెట్టినా సకాలంలో స్పందించి సమస్య లేకుండా చూశామ‌ని తెలిపారు.

 

2018లో పెన్నానదికి చుక్కనీరు లేకపోయినా శ్రీశైలం నుంచి 48.5 టీఎంసీల క్రిష్ణా జలాలు తీసుకొచ్చి పంటలు పండించామ‌ని, విరుగుళ్ల కారణంగా బీపీటీ ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు వస్తే రైతులు నష్టపోకూడదని పుట్టికి రూ.1740 బోనస్ ఇప్పించామ‌ని, నెల్లూరు జిలకర గ్రేడ్ విషయంలో ఉన్న సమస్యను పరిష్కరించి రైతులు నష్టపోకుండా చేశామ‌ని తెలిపారు.

పసుపు, మిర్చి, మామిడి పంటల అమ్మకాల విషయంలో రైతులకు ఇబ్బందులు ఎదురైతే ప్రత్యేక ఇన్సెంటివ్ లు ఇచ్చి ఆదుకున్నామ‌ని, ధాన్యానికి కనీస మద్దతు ధర పొందడం ప్రతి రైతు హక్కు…ధర తగ్గించి కొనుగోలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చట్టం చెబుతోంది.

కానీ మన దౌర్భాగ్యం ఏమిటంటే మద్దతు ధర కోసం నిలదీస్తే కేసులు పెడుతున్నారన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు తెలిసిందొకటే..వారి అవినీతి, అక్రమాలను ప్రశ్నించిన వారిని బూతులు తిట్టడం, తిట్టించడం, తప్పుడు కేసులు పెట్టడం… ఇప్పటి వరకూ ధాన్యాన్ని మూడు దుగ్గాలకు తెగ అమ్ముకున్న రైతులకు నష్టపరిహారం చెల్లించండని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాo ఈ రోజు నుంచైనా నెల్లూరు జిల్లాలో రైతు భరోసా కేంద్రాలు తెరవండి, ధాన్యాన్ని రైతు దగ్గర మద్దతు ధరకు కొనండని అన్నారు.

 

కార్య‌క్ర‌మంలో టీడీపీ నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ అజీజ్, నెల్లూరు నగర ఇంఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, తాళ్ళపాక రమేష్ రెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ,మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామారావు,జెడ్పీ మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి, రాఘవేంద్రరెడ్డి, రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షలు మర్రెడ్డి శ్రీనివాసులు రెడ్డి, తిరుపతి పార్లమెంట్ రైతు అధ్యక్షలు రావూరి రాధాకృష్ణమ నాయుడు, జెడ్. శివప్రసాద్,కావలి ఇన్ చార్జి మాలేపాటి సుబ్బానాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కడగుంట్ల మధుబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

మూడు పూటలా అన్నం పెట్టే రైతు నోట్లో, జగన్ రెడ్డి మట్టి కొడుతున్నారు

Spread the loveమూడు పూటలా అన్నం పెట్టే రైతు నోట్లో, జగన్ రెడ్డి మట్టి కొడుతున్నారు లాభ నష్టాలను లెక్క చేయకుండా, రైతులు పంటలు పండించి మనకు అన్నం పెడుతున్నారు జగన్ రెడ్డి రైతులను ఆదుకోవాల్సింది పోయి, అబద్ధపు కరపత్రాలు విడుదల చేస్తున్నారు రైతుల ఆత్మహత్య లో ఆంధ్ర రాష్ట్రం రెండో స్థానంలో ఉంది రైతు పండించిన ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు పోరాడుతాం జిల్లా కలెక్టర్ […]

You May Like

error: Content is protected !!