వైసీపీ అభివృద్ధిని అడ్డుకునేందుకు టిడిపి కోర్టులు చుట్టూ ప్రదక్షిణలు -ఎమ్మెల్యే కాకాణి

జగన్మోహన్ రెడ్డి మునుపు ఎన్నడూ లేని విధంగా నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పధకం కింద, ఇళ్ల స్థలాల పంపిణీకి శ్రీకారం చుట్టడం జరిగిందని,సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండల రెవిన్యూ కార్యాలయంలో “నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు” పథకంపై అధికారులతో సమీక్షించి, ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 8వ తేది ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలనుకున్నా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు ఆగస్టు15న ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారన్నారు. గత ప్రభుత్వాలు పేదలకు పట్టాలు ఇచ్చారు తప్ప భూములు ఎక్కడున్నాయో చూపించక అవస్థల పాలు చేశారని తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో గతం మాదిరిగా జరగ కూడదని భూములను గుర్తించి లేఅవుట్లు వేసి, వాటిని అభివృద్ధి చేసి అర్హులైన పేదలకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారని,దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రజల సొంతింటి కలను తీర్చాలని పేదలందరికీ ఇళ్ల పధకం కింద ఇళ్ల స్థలాల పంపిణీ చేపడితే, చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు కోర్టుకు వెళ్లి ఎందుకు అడ్డుపడుతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు తెలుగుదేశం నాయకులు నానా అవస్థలు పడుతున్నారని అన్నారు.
నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని అధికారులకు సూచించామని,అనర్హులుగా ఉన్న వారి పేర్లు తొలగించి, అర్హులకు న్యాయం చేయడం జరుగుతుందని తెలిపారు. బడాబాబులు ఆక్రమించిన భూములను వెనక్కి తీసుకునేందుకు చర్యలు చేపడితే, గతంలో మంత్రులుగా పనిచేసిన వారు విమర్శల దాడికి దిగుతున్నారని పేర్కొన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, ఆగస్టు 15వ తేదీ నాడు అర్హులందరికీ ఇళ్ల పట్టాలు అందిస్తామని తెలియజేసారు.గతంలో అధికారం వెలగబెట్టిన వారి మాటలు కోటలు దాటాయి తప్ప, చేతలు గడపలు దాటలేదని, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీను నిలబెట్టుకుంటానని హామీ ఇచ్చారు.